ముఖ్యమంత్రి అధికారాలు & విధులు
ముఖ్యమంత్రికి పదవీ కాలం అంటూ ఉండదు. కానీ ముఖ్యమంత్రిగా ఆ సభలో మెజారిటీ ఉన్నంత కాలం లేదా ఆ పార్టీ, ముఖ్యమంత్రిగా ఆయనను ఉంచినంత కాలం ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పుడు ఆ అధికార పార్టీ అతన్ని తీసివేసి ఇంకొక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. దీనిని బట్టి చూస్తే భారత్లో ముఖ్యమంత్రి పదవికి పదవీ కాలం అంటూ ఏమీ ఉండదు అని అర్ధమవుతుంది.
ఉదాహరణకు: గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇంకా కొన్ని….
హర్యానాలో 2019 అక్టోబర్లో ఏర్పడిన ప్రభుత్వం యొక్క కాలపరిమితి 2024 అక్టోబర్ వరకు ఉంది. కానీ, ఐదేళ్ల కాలం పూర్తి కావడానికి కొన్ని నెలల ముందే అక్కడ ముఖ్యమంత్రి మారారు.
మనోహర్ లాల్ ఖట్టర్ (బిజెపి) తన పదవికి రాజీనామా చేశారు. (తరువాత ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు). ఆయన స్థానంలో నాయబ్ సింగ్ సైనీ మార్చి 12, 2024న హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
లోక్సభ సీట్ల సర్దుబాటు విషయంలో బిజెపి మరియు జననాయక్ జనతా పార్టీ (JJP) కూటమి మధ్య విభేదాలు రావడం, అలాగే పార్టీలో అంతర్గత వ్యూహంలో భాగంగా ఈ మార్పు జరిగింది.
జార్ఖండ్లో 2019 డిసెంబర్లో ఏర్పాటైన ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకోకముందే ఒకే ఏడాదిలో రెండుసార్లు ముఖ్యమంత్రి మార్పు జరిగింది.
మొదటగా హేమంత్ సోరెన్ (JMM) భూ కుంభకోణం ఆరోపణల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేతిలో అరెస్ట్ కావడానికి ముందు, జనవరి 31, 2024న తన పదవికి రాజీనామా చేశారు.
ఆయన స్థానంలో జేఎమ్ఎమ్ (JMM) సీనియర్ నేత ఛాంపి సోరెన్ ఫిబ్రవరి 2, 2024న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మళ్లీ జూలై 2024 నా హేమంత్ సోరెన్ జైలు నుండి బెయిల్ పై విడుదలైన తర్వాత, ఛాంపి సోరెన్ జూలై 3, 2024న రాజీనామా చేశారు. దాంతో హేమంత్ సోరెన్ మళ్లీ జూలై 4, 2024న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
బీహార్లో 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఐదేళ్ల పరిపాలన ముగియక ముందే అక్కడ కూటమి మారడంతో సాంకేతికంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, మళ్లీ కొత్త కూటమితో ముఖ్యమంత్రి అయ్యారు.
ఇలా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయన అంతకుముందు ఆర్జేడీ (RJD), కాంగ్రెస్లతో కూడిన 'మహాఘటబంధన్' కూటమిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ తర్వాత జనవరి 2024 ఆ కూటమికి రాజీనామా చేసి, బిజెపి (బిజెపి) వెంటనే ఎన్డిఎ కూటమితో కలిసి 9వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇలాంటి మార్పులు సాధారణంగా పార్టీల అంతర్గత వ్యూహాలు, న్యాయపరమైన ఇబ్బందులు లేదా రాజకీయ కూటముల మార్పుల వల్ల జరుగుతుంటాయి.
సాధారణ ప్రభుత్వాలు 2 రకాలుగా ఉంటాయి. అవి:
1) పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
2) ప్రెసిడెన్షియల్ (రాష్ట్రపతి) తరహా ప్రభుత్వం
పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో నిజమైన అధికారాలు కేంద్రం ప్రధానమంత్రికి & రాష్ట్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రికి ఉంటాయి.
ప్రెసిడెన్షియల్ తరహా ప్రభుత్వంలో నిజమైన అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి.
భారత్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి అధికారాలన్నీ కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి & రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంటాయి.
కాబట్టి ముఖ్యమంత్రి రాష్ట్రంలో మంత్రి వర్గానికి ప్రతినిధిగా వ్యవహరించారు.
ఆర్టికల్ 163, 164, 166, 167 ప్రాధాన్యత:
ఆర్టికల్ 163 ప్రకారం ఒక గవర్నర్కి సహాయం చేయడానికి ఒక మంత్రి మండలి ఉంటుంది.
మంత్రి మండలి ఇచ్చిన సలహాను అడగడానికి కోర్టులలో ప్రశ్నించడానికి వీలు లేదు. కాకపోతే ఏమని సలహా ఇచ్చారు? మంచి కోసం ఇచ్చారా? లేదా రాజ్యాంగం కోసం ఇచ్చారా? అని కోర్ట్ ద్వారా ప్రశ్నించవచ్చు.
మంత్రి మండలి ఇచ్చిన సలహాను గవర్నర్ తిరిగి పంపవచ్చు. ఒకవేళ మంత్రిమండలి అదే సలహాను తిరిగి ఇస్తే గవర్నర్ ఆమోదించాలి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం, గవర్నర్ తన విధులను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిని మంత్రిమండలి సహాయం మరియు సలహా ప్రకారం నడుచుకోవాలి. అయితే, కొన్ని సందర్భాల్లో గవర్నర్లు ఈ సలహాలను పక్కనబెట్టడం వల్ల కోర్టుల వరకు వెళ్లాయి.
మంత్రిమండలి సలహాలపై వచ్చిన కొన్ని ముఖ్యమైన కోర్టు కేసులు మరియు తీర్పుల గురించి తెలుసుకుందాం.
1. శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం (1974) – సుప్రీం కోర్టు:
ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన కేసు. మన దేశంలో బ్రిటీష్ తరహా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. కాబట్టి, రాష్ట్రపతి మరియు గవర్నర్లు రాజ్యాంగబద్ధమైన నామమాత్రపు అధిపతులు మాత్రమే.
రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన కొన్ని ప్రత్యేక మినహాయింపులు (విచక్షణాధికారాలు) తప్ప, మిగిలిన అన్ని విషయాలలో తప్పనిసరిగా గవర్నర్ మంత్రిమండలి ఇచ్చే సలహా మేరకే పనిచేయాలి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది
2. నబమ్ రేబియా వర్సెస్ డెప్యూటీ స్పీకర్ (2016) – సుప్రీం కోర్టు:
అరుణాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరుపై ఈ కేసు నడిచింది. అసెంబ్లీ సమావేశాలను (సెషన్) ఎప్పుడు ఏర్పాటు చేయాలి, ఎప్పుడు వాయిదా వేయాలి (ప్రోరోగ్) అనే విషయాల్లో గవర్నర్కు సొంత నిర్ణయాధికారం లేదు.
ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ఎప్పుడు సలహా ఇస్తే, ఆ సలహా ప్రకారం అసెంబ్లీని సమావేశపరచాలి అని కోర్టు తేల్చి చెప్పింది.
3. తమిళనాడు గవర్నర్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం (2025 ఏప్రిల్) – సుప్రీం కోర్టు:
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ కాలయాపన చేయడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించి పంపినప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్కు ఎలాంటి 'అపరిమిత విచక్షణాధికారం' (Absolute Veto) ఉండదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
సాధారణ నిబంధనల ప్రకారం, బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో కూడా గవర్నర్ రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాలి. ఒకవేళ బిల్లును వెనక్కి పంపినా, అసెంబ్లీ దాన్ని మళ్లీ యథాతథంగా ఆమోదించి పంపితే గవర్నర్ దానికి ఖచ్చితంగా ఆమోదం తెలపాల్సిందే.
4. మద్రాస్ హైకోర్టు పూర్తి బెంచ్ తీర్పు (2026 ఏప్రిల్):
ఖైదీల ముందస్తు విడుదల (రిమిషన్) మరియు క్షమాభిక్ష అధికారాలకు (ఆర్టికల్ 161) సంబంధించి ఈ కేసు నడిచింది. ఆర్టికల్ 161 కింద ఖైదీల శిక్షను తగ్గించడం లేదా వారిని విడుదల చేసే విషయంలో గవర్నర్ పూర్తిగా రాష్ట్ర మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలి.
మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఎలాంటి విచక్షణాధికారం గవర్నర్కు లేదని, ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా క్యాబినెట్ సలహాను పాటించాల్సిందేనని మద్రాస్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
5. తెలంగాణ ఎమ్మెల్సీల కోటా కేసు (2024) – హైకోర్టు:
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి అప్పటి మంత్రిమండలి పంపిన సిఫార్సులను అప్పటి గవర్నర్ తిరస్కరించడంపై ఈ వివాదం రేగింది.
మంత్రిమండలి అన్ని సిఫార్సులను గవర్నర్ కళ్లు మూసుకుని యథాతథంగా ఆమోదించాల్సిన అవసరం లేదు, అభ్యర్థుల నేపథ్యం సరిగ్గా లేకపోతే గవర్నర్ వాటిపై వివరణ కోరినట్లు కోర్టు ప్రకటించింది. అయితే, రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్లు రాజకీయాలకు అతీతంగా, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.
ఆర్టికల్ 164: మంత్రి మండలికి సంబంధించిన కొన్ని విషయాలు వివరిస్తుంది. అవి ముఖ్యమంత్రిని గాని లేదా మంత్రి మండలిని గాని నియమించేది గవర్నర్.
ఆర్టికల్ 164 (1A): మంత్రి మండలిలోని సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర అసెంబ్లీలో MLA ల సంఖ్య కంటే 15% మించరాదు. ఢిల్లీలో అయితే 10% కంటే ఎక్కువ ఉండరాదు. [91 వ రాజ్యాంగ సవరణ చట్టం - 2003]
తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 119 కావున మంత్రి మండలిలో 18 కన్నా ఎక్కువ మించరాదు. కనీసం 12 మంది ఉండాలి.
ఆర్టికల్ 164 (1B): ఒక MLA / MLC గా అనర్హత సాధిస్తే ఆటోమెటిక్గా మంత్రి పదవిని కోల్పోయారు.
ఆర్టికల్ 164 (2): మంత్రి మండలి అంతా గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది (ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను తీసివేస్తారు).
మంత్రుల పదవీకాలం ఎంతన్నది కచ్చితమైన కాలం అంటూ ఉండదు.
ఆర్టికల్ 164 (3): మంత్రిమండలి అంతా అసెంబ్లీకి బాధ్యతయుతంగా ఉండాలి. అసెంబ్లీ ఉన్నంత కాలం మంత్రిమండలి కొనసాగుతుంది. అసెంబ్లీ విశ్వాసం కోల్పోతే మంత్రిమండలి రాజీనామా చేయవలసి ఉంటుంది.
ఆర్టికల్ 164 (4) యొక్క ప్రాముఖ్యత:
ముఖ్యమంత్రి & మంత్రిమండలి చేత ప్రమాణ స్వీకారం గవర్నర్ చేయిస్తారు.
మంత్రులు, ముఖ్యమంత్రి గారిచే 2 రకాల ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు:
ఓత్ ఆఫ్ ఆఫీస్ (పదవిలోకి వచ్చేముందు)
ఓత్ ఆఫ్ సీక్రెసీ [ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మేము రహస్యంగా ఉంచుతాము అని ప్రమాణం చేస్తారు.]
ఆర్టికల్ 164 (5): ఒక వ్యక్తి MLA గాని/ MLC గాని కాకుండా ఆ మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని అవ్వవచ్చు. కాకపోతే 6 నెలల్లో MLA / MLC గా ఎన్నిక కావాలి.
ఆర్టికల్ 164 (6): జీతాలు & అలవెన్సెస్ షెడ్యూల్ 2 ప్రకారం ఇస్తారు. వీరి జీతాలు ఒక ఎమ్మెల్యేకు ఎంతైతే ఇస్తారో అంతే ఇస్తూ, కొంత అలవెన్స్ కలిపి ముఖ్యమంత్రికి & మంత్రులకు ఎక్కువగా ఉంటాయి.
ఆర్టికల్ 166: రాష్ట్రంలో కార్యనిర్వాహక అధికారాలన్నీ గవర్నర్ పేరు మీదుగా కొనసాగుతాయి.
ఆర్టికల్ 167: సీఎం గవర్నర్కు మధ్య గల సంబంధాన్ని తెలియచేస్తుంది. అనగా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గవర్నర్కు అందిస్తూ ఉండాలి. అలాగే గవర్నర్ ఏదైనా కావాలనుకున్నప్పుడు CM నుండి తెప్పించుకుంటాడు.
ఏదైన ఒక నిర్ణయాన్ని మంత్రి మండలిలో పెట్టకుండా మంత్రి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మంత్రి మండలిలో పెట్టమని గవర్నర్ సలహా ఇవ్వవచ్చు. కారణం ఏదైనా ఒక్క నిర్ణయాన్ని మంత్రి మండలి మొత్తం సమిష్టిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ముఖ్యమంత్రి అధికారాలు:
ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చూసుకుంటాడు.
ఎవరినైనా మంత్రిమండలి నుండి తొలగించాలనుకున్నా అది కూడా ముఖ్యమంత్రి చూసుకుంటాడు.
అడ్వొకేట్ జనరల్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ & సభ్యుల నియామకం, రాష్ట్ర ఎన్నికల సంఘం నియామకంలో CM గవర్నర్కు సలహా ఇస్తారు.
సమావేశాలు ఎప్పుడు ప్రారంభం కావాలి, సమావేశాలు ఎప్పుడు వాయిదా వేయాలి, అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేయాలి ఇత్యాది అసెంబ్లీ సమావేశాలు కూడా ముఖ్యమంత్రి గవర్నర్కు సలహా ఇస్తారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్గా, జోనల్ కౌన్సిల్కు వైస్ చైర్మన్గా, అంతర్రాష్ట్ర మండలి సభ్యుడిగా, జాతీయ అభివృద్ధి మండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుండి ప్రతినిధులు వచ్చినప్పుడు రాష్ట్రం యొక్క ప్రధాన బాధ్యత వ్యక్తిగా, విపత్తులకు సంబంధించిన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్మన్గా, రాష్ట్ర ముఖ్య ప్రతినిధిగా ముఖ్యమంత్రి విధులు నిర్వహించారు.
నేటి ఆధునిక పరిపాలనలో ముఖ్యమంత్రి పాత్ర (ముగింపు):
రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 నుండి 167 వరకు ఉన్న నిబంధనలు ముఖ్యమంత్రి పదవికి ఒక నియమావళి, కార్యనిర్వాహక చట్రాన్ని అందిస్తే... నిజ జీవితంలో ఆ పదవి యొక్క ప్రభావం ఆ నాయకుడిచ్చిన దర్శనికత, జవాబుదారీతనంపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి కేవలం ఒక రాజ్యాంగ అధిపతి మాత్రమే కాదు, ఒక రాష్ట్ర ప్రగతి చక్రానికి వారే చోదక శక్తి.
నేటికి దీని ప్రాధాన్యత:
ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రజలు చాలా చైతన్యవంతులయ్యారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి చిన్న చూపు కూడా గమనించవచ్చు, పారదర్శకమైన పరిపాలనను కోరుకుంటున్నారు.
నేటి సమాజంలో పరిపాలన అంటే కేవలం శాంతిభద్రతలను కాపాడటం మాత్రమే కాదు; వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించడం, డిజిటల్ సాంకేతికతను ప్రజల్లోకి తీసుకెళ్లడం, విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడం మరియు సంక్షేమ పథకాలను అట్టడుగు వర్గాలకు చేర్చడం.
21వ శతాబ్దంలో ఒక ముఖ్యమంత్రి రాజకీయ సమీకరణలను సమతూకం చేస్తూనే, సుస్థిర అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపించాల్సి ఉంటుంది. ప్రజారోగ్య సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూనే... పారిశ్రామిక ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రే ప్రజలకు ఒక భరోసాగా నిలుస్తోంది.
చివరిగా చెప్పాలంటే, ఒక ముఖ్యమంత్రికి నిజమైన విజయం అనేది వారు చట్టబద్ధంగా అనుభవించే రాజకీయ అధికారంలో లేదు. సామాన్య పౌరుడి జీవితాన్ని ఎంతవరకు మెరుగుపరిచారు, సమాజంలో ఎంతటి సమిష్టి అభివృద్ధిని తీసుకువచ్చారు అంటే దానిపైనే ఆ పదవి యొక్క సార్థకత ఉంటుంది.

0 Comments